వినాయక చవితి ప్రాముఖ్యత | వినాయకుడి విశిష్టత What to do on Vinayaka Cha...

వినాయకుడి విశిష్టత

హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాధునికే చేస్తారు. పార్వతీ తనయుడు అనుగ్రహాం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని ప్రగాఢ నమ్మకం. భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని, గణాధిపత్యం వచ్చిందనే పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, విఘ్నాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు.

పూర్వం గజాసురుడనే రాక్షసుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి ఆయన ఎల్లప్పుడూ తన కడుపులోనే ఉండిపోవాలన్న కోరికను కోరి కడుపులోనే మహాశివుడిని దాచుకుంటాడు. కొన్ని రోజులకు ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీ దేవి శ్రీమహావిష్టువు సహాయం కోరగా ఆయన బ్రహ్మ సాయంతో నందిని తీసుకొని గంగిరెద్దులను ఆడించేవారిగా వెళ్లి గంగిరెద్దును గజాసురుడి ముందు ఆడిస్తారు. దానికి తన్మయత్వం పొందిన గజాసురుడు ఏం కావాలో కోరుకోమని చెబుతాడు. దీంతో విష్ణుమూర్తి శివుడిని తిరిగి ఇచ్చేయమని కోరగా.. తన దగ్గరికి వచ్చింది సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువేనని అర్థం చేసుకున్న గజాసురుడు నందీశ్వరుడిని తన పొట్ట చీల్చమని శివుడిని బయటకు వచ్చేలా చేశాడు. ఆ తర్వాత తన తలను లోకమంతా ఆరాధించబడేలా చేయమని, తన చర్మాన్ని శివుడి వస్త్రంగా ధరించమని కోరుకొని మరణించాడు.

శివుడి రాక గురించి విన్న పార్వతీ దేవి చాలా సంతోషించి భర్త రాక సందర్బంగా అందంగా సిద్ధమయ్యేందుకు నలుగు పెట్టుకుంటూ ఆ నలుగు పిండితో ఓ బాలుడి రూపాన్ని తయారుచేసి దానికి ప్రాణం పోసి ద్వారం వద్ద నిలబెట్టి ఎవరినీ రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్లింది. ఆ బాలుడు సాక్షాత్తూ పరమేశ్వరుడినే ఎదుర్కోగా ఆయన కోపంతో బిడ్డ శిరస్సును ఖండించి లోపలికి వెళ్లాడు. అప్పటికే స్నానం ముగించుకొని అలంకరించుకున్న పార్వతీ దేవి భర్తను చూసి సంతోషించి ఆయనతో మాట్లాడింది. కాసేపటికి బయట ఉన్న బాలుడి ప్రస్తావన రాగా శివుడికి అతడు తమ బిడ్డ అని పార్వతీ దేవి చెబుతుంది. శివుడు బాధతో గజాసురుడి తలను ఆ పిల్లవాడికి అతికించి అతడిని బతికించాడు. గజ ముఖం ఉండడం వల్ల వినాయకుడు గజాననుడిగా పేరు పొందాడు. అతడి వాహనం అనింద్యుడు అనే ఎలుక.

కొన్ని రోజుల తర్వాత దేవతలంతా పరమేశ్వరుడి వద్దకు వెళ్లి తమకు విఘ్నం రాకుండా ఉండేందుకు కొలవడానికి ఓ దేవుడిని ప్రసాదించమని కోరగా ఆ పదవికి గజాననుడు, కుమార స్వామి ఇద్దరూ పోటీ పడ్డారు. ముల్లోకాల్లోని పుణ్య నదులన్నింటిలో స్నానం చేసి తిరిగి మొదట వచ్చిన వారే ఈ పదవికి అర్హులు అని చెప్పగా వెంటనే కుమార స్వామి నెమలి వాహనం ఎక్కి వెళ్లిపోయాడు. గజాననుడు మాత్రం నా బలాబలాలు తెలిసి మీరీ షరతు విధించడం సబబేనా? అని అడగ్గా.. తండ్రి అతడికో తరుణోపాయం చెప్పాడు.

ఓ మంత్రాన్ని వివరించి తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి దాన్ని పఠించమని చెప్పగా మంత్ర పఠనం చేస్తూ వినాయకుడు అక్కడే ఉండిపోయాడు. ఈ మంత్ర ప్రభావం వల్ల కుమార స్వామికి తాను వెళ్లిన ప్రతి చోట తనకంటే ముందుగా వినాయకుడే స్నానం చేసి వెళ్తున్నట్లుగా కనిపించసాగింది. దాంతో తిరిగొచ్చి తండ్రీ అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను. నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యం అప్పగించండి అని చెప్పాడు. అలా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు విఘ్నేశ్వరుడయ్యాడు. ఆ రోజు దేవతలు, మునులు అందరూ వివిధ రకాల కుడుములు, పాలు, తేనె, అరటి పళ్లు, పానకం, వడపప్పు వంటివన్నీ సమర్పించారు.

వాటిని తినగలిగినన్ని తిని మిగిలినవి తీసుకొని భుక్తాయాసంతో రాత్రి సమయానికి కైలాసం చేరుకున్నాడు. తల్లిదండ్రుల కాళ్లకు నమస్కారం చేయడానికి ప్రయత్నిస్తే కడుపు నేలకు ఆనుతుందే కానీ చేతులు ఆనట్లేదు. ఇది చూసి చంద్రుడు నవ్వగా దిష్టి తగిలి పొట్ట పగిలి వినాయకుడు చనిపోతాడు. దీంతో పార్వతీ దేవి ఆగ్రహించి ఆ రోజు చంద్రుడిని చూసిన వాళ్లందరూ నీలాపనిందలకు గురవుతారని శాపమిస్తుంది. చంద్రుడిని చూసిన రుషి పత్నులు తమ భర్తల దగ్గర అపనిందలకు గురవుతారు.

రుషులు, దేవతలు ఈ విషయాన్ని శ్రీమహా విష్ణువుకి విన్నవించగా ఆయన అంతా తెలుసుకొని రుషులకు తమ భార్యల గురించి నిజం చెప్పి ఒప్పించడంతో పాటు వినాయకుడి పొట్టను పాముతో కుట్టించి ఆయనకు అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. ఆ తర్వాత దేవతలందరి విన్నపం మేరకు పార్వతి తన శాపవిమోచనాన్ని ప్రకటిస్తుంది. ఏ రోజైతే చంద్రుడు నా కుమారుడిని చూసి నవ్వాడో ఆరోజు మాత్రం అతడిని చూడకూడదు అని చెబుతుంది. దీంతో దేవతలంతా సంతోషిస్తారు. ఆ రోజే భాద్రపద శుద్ధ చవితి. ఆ రోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటాం.


Comments