ఖమ్మం పుట్టుకకు మూలకారణం ఈ నరసింహ క్షేత్రం | Sri Lakshmi Narasimha Templ...
శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఖమ్మం జిల్లా ప్రధానకేంద్రం ఖమ్మం పట్టణం నడిబొడ్డున ఒక ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయము. ఇది తెలంగాణ లోని ప్రముఖ ఆలయాలలో ఒకటి. ప్రహ్లదుడిని రక్షించేందుకు నరసింహస్వామివారు ఒక స్తంభంలోనుంచి బయటకు వచ్చారని కథనం. అటువంటి స్తంభాన్నికలిగివున్న ప్రాంతం కాబట్టి స్తంభాద్రి, స్తంభశిఖరి, కంభంమెట్టు అనే పేర్లనుంచి కాలక్రమంలో ఖమ్మం అనే పేరు ఏర్పడింది అని చెపుతారు.
పూర్వం మౌద్గల మహర్షి ఈ స్థంబాధ్రి ప్రాంతంలో శ్రీ హరి గురించి తపస్సు చేయగా శ్రీహరి లక్ష్మీసమేత నరసింహుడిగా ప్రత్యక్షమయాడు. శ్రీ హరి ముని కోరిక మేరకు ఇక్కడే భక్తుల దర్శనార్థం ఒక గుహలో కొలువు తీరాడని స్థల పురాణం. ఖమ్మం కోట నిర్మాణ సమయంలో కాకతీయ చక్రవర్తి స్వామివారికి ఆలయం నిర్మించాడని చరిత్ర వలన తెలుస్తున్నది.
శ్రీమహావిష్ణువు నరసింహావతారంలో హిరణ్యకశిపుడనే రాక్షసుడిని సంహరించి ఆయన కుమారుడు ప్రహ్లాదుడిని కాపాడే కథ చాలా ప్రముఖమైనదే. ఆనాడు స్తంభము నుండి ఉద్భవించిన స్వామియే ఈ కొండపై ఉన్న గుహలో వెలిసాడని అందుచేతనే కొండకు స్తంభాద్రి అనే పేరు వచ్చిందని చెపుతారు.అంతేకాక ఈ కొండమొత్తంగా కూడా ఒక స్తంభంఆకారంలో వుంటుంది. కాబట్టి కూడా పట్టణానికి స్తంభాద్రి అనే పేరు వచ్చేందనేది మరొక కథనం.అంతేకాక ఆరోజులనుంచే కంభంమెట్టు అనే పేరు వుందని ఖమ్మంజిల్లా ఆదికవి హరిభట్టు తన వరాహ పురాణములో పేర్కొన్నాడు.
1953వ సంవత్సరంలో ఖమ్మం ప్రత్యేక జిల్లాగా అవతరించిన తర్వాత ఖమ్మం మెట్టును ఖమ్మంగానూ అదేవిధంగా అప్పటివరకూ వరంగల్ జిల్లాలో భాగంగా మాత్రమే వున్న ఖమ్మ జిల్లాను ఒక ప్రత్యేక జిల్లాగానూ గెజిట్ ద్వారా మార్చారు. ఇలా జిల్లా పేరుకు ప్రధాన కారణంగా ఈ ఆలయం కావటం మరింత ప్రత్యేకత.
కొండను తొలచి చేసిన స్థంభాలపై చెక్కిన కాకతీయుల శిల్ప కళాశైలి చూపరులను అబ్బుర పరుస్తుంది. రాతితో నిర్మించిన ఏకశిలా ధ్వజస్థంభం ఇక్కడి ప్రత్యేకత. మరో విశేషమేమంటే స్వామి వారు దక్షిణాభిముఖంగా ఉండటము. గర్బగుడిలో స్వామి వారికి ఎడమవైపున లక్ష్మీదేవి, కుడివైపున అద్దాల మండపం ఉంటాయి. ధ్వజ స్తంభం ప్రక్కనే ఆంజనేయ స్వామి మందిరం, గుట్టపై సుబ్రమణ్యస్వామి, విష్ణుమూర్తి, ఆంజనేయ మందిరం, శ్రీవేంకటేశ్వరాలయం ఉన్నాయి. ఇక్కడున్న స్వామివారి కోనేరులో నీరు అన్ని వేళలా ఉంటుంది. వర్షాకాలంలో నీరు ఎక్కువై ఆలయంలోని స్వామి వారి నాభి వరకు నీరు చేరుతుంది. ఆ సందర్భంలో ఆ నీటిని బయటకు పంపుతారు. ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత ఏమంటే నల్లరాతిలో చెక్కిన సాయిబాబా విగ్రహము. నల్లరాతి సాయిబాబా విగ్రహం ఉన్న ఆలయం మన రాష్ట్రంలో ఇదొక్కటే నని చెపుతారు
Comments
Post a Comment